తనకు దక్కిన మంత్రి పదవి ఎవరి బిక్ష కాదని తెలంగాణ రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం హూజూరాబాద్లోని సాయిరూపా గార్డెన్స్ లో టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఈటల మాట్లాడుతూ బీసీ కోటాలో మంత్రి పదవి కావాలని తాను ఏనాడూ అడగలేదన్నారు. ధర్మాన్ని, న్యాయాన్ని ఎప్పుడుమోసం చేయలేరని వ్యాఖ్యానించారు. తాను ఎవరి వద్దనైనా ఒక్క రూపాయి తీసుకొన్నట్టుగా రుజువు చేస్తారా అని ఆయన ప్రశ్నించారు.
తాను ఇల్లు కట్టుకొంటే ఎందుకు కక్ష కట్టారని ఆయన ప్రశ్నించారు. చిల్లర ప్రచారంపై సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేదన్నారు. న్యాయం నుండి ఎవరూ తప్పించుకోలేరని ఈటల అభిప్రాయపడ్డారు. తాను ఎల్లప్పుడు వెలిగే దీపాన్ని అని ఆయన చెప్పుకొన్నారు. తాను పార్టీలో మధ్యలో వచ్చిన వ్యక్తి కాదన్నారు. ప్రజలే చరిత్ర నిర్మాతలని ఎవరు హీరో..ఎవరు జీరోలో త్వరలోనే తేలుతుందని ఆయన చెప్పారు. కొంత కాలంగా ఆయనను మంత్రివర్గం నుండి తప్పిస్తారని ప్రచారం సాగుతున్న తరుణంలో ఈటల ఈ వ్యాఖ్యలు చేయడంతో రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.