రాష్ట్రంలో కరోనా వైరస్ ఒక్కరికి కూడా సోకలేదని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. వైద్యశాఖ ఉన్నతాధికారులతో కరోనా వైరస్పై మంత్రి నేడు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ… గత నెల రోజులుగా కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోందన్నారు.
కరోనా వ్యాధి అనుమానితులకు ఇప్పటికే పరీక్షలు పూర్తి అయ్యాయి.. వ్యాధి నిర్ధారణ కాలేదన్నారు. విదేశాల నుంచి వచ్చే వారిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్లోని గాంధీ, ఫీవర్, చెస్ట్ ఆస్పత్రుల్లో ప్రత్యేక ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అదేవిధంగా ఆస్పత్రుల్లో ప్రత్యేక నోడల్ ఆఫీసర్లను నియమించినట్లు తెలిపారు. కరోనా వైరస్ను గుర్తించేందుకు కావాల్సిన పరికరాల కోసం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు మంత్రి వెల్లడించారు. ప్రజలందరూ కూడా కరోనా వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.