telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

వైద్యులు సెలవులు లేకుండా పని చేస్తున్నారు: మంత్రి ఈటల

Etala Rajender

సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రిని ఈరోజు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్యంపై ఆసుపత్రి సూపరింటెండెంట్ ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నూతన సెమినార్ హాల్, లైబ్రరీని మంత్రి ప్రారంభించారు. అనంతరం ఈటల మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ, బోధనా ఆసుపత్రుల్లో వైద్యులు సెలవులు లేకుండా పని చేస్తున్నారని అన్నారు. రోగులకు అవసరమైన మందులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతున్నామని అన్నారు.

గతంలో డెంగీ వ్యాధి వస్తే చనిపోయేవారని, ఇప్పుడు దాని తీవ్రత తగ్గిందని, రోగుల సంఖ్య పెరిగినా త్వరగానే వ్యాధి నయమవుతోందని అన్నారు. ఫీవర్ ఆసుపత్రిలో 51 వేల మందికి పరీక్షలు చేస్తే 62 మందికే డెంగీ వ్యాధి ఉన్నట్టు తేలిందని, గాంధీ ఆసుపత్రిలో 419 మందికి నయం చేసి పంపారని వివరించారు. రోజూ ప్రైవేట్ ఆసుపత్రులు రోగుల నివేదికను డీఎంహెచ్ వో కు పంపాలని ఆదేశించినట్టు చెప్పారు. ప్రజలు కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రజలు, ప్రభుత్వం కలిసి పని చేస్తేనే సమస్యల నుంచి బయటపడతామని మంత్రి అన్నారు.

Related posts