సామంతరాజు జగన్ అండతో అమరావతిపై కేసీఆర్ దండయాత్ర చేస్తున్నారని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. వైసీపీ అరాచకాలపై గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి పదవి వ్యామోహంతో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కుట్ర రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీపై మోదీ, కేసీఆర్, జగన్ ముప్పేట దాడి చేస్తున్నారని దేవినేని తీవ్రస్థాయిలో విమర్శించారు. జగన్ వస్తే రౌడీరాజ్యం వస్తుందని దేవినేని వ్యాఖ్యానించారు.
ఓడిపోతామనే భయంతోనే కార్యకర్తలను జగన్ రెచ్చగొడుతున్నారని అన్నారు. వైసీపీ కార్యకర్తలు సీఐఎస్ఎఫ్ మీద రాళ్లు, చెప్పులు విసురుతున్నారని దేవినేని ఉమ అన్నారు. సభా వేదిక పైనుంచి జగన్ దిగగానే సీఐఎస్ఎఫ్ జవాన్లపై చెప్పులు విసిరారని విమర్శించారు. మైలవరం చరిత్రలోనే ఎప్పుడూ లేని అరాచకాన్ని జగన్ సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పసుపు-కుంకుమ డబ్బులు ఆపాలని జగన్ విశ్వప్రయత్నాలు చేశారని దేవినేని విమర్శించారు.