పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం కోల్కతాలో నిర్వహించిన మెగా ర్యాలీ విజయవంతమైందని టీడీపీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..బీజేపీ వ్యతిరేకపక్షాలన్నీ ఒకే వేదికపైకి వచ్చాయన్నారు. మరి కోల్కతా ర్యాలీకి తెలంగాణ సీఎం కేసీఆర్ ఎందుకు వెళ్లలేదో వైసీపీ అధ్యక్షుడు జగన్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
దేశాన్ని పరిరక్షించే ఫ్రంట్ ఒకవైపు ఉంటే మోదీ, కేసీఆర్, జగన్ ఫిడేల్ ఫ్రంట్ మరోవైపు ఉందని దేవినేని ఎద్దేవా చేశారు.కేసీఆర్తో చేతులు కలిపి ఏపీ రైతులకు జగన్ అన్యాయం చేస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు అడ్డగోలుగా నిర్మిస్తోందని ఆరోపించారు. పులివెందులకు కూడా చంద్రబాబు సాగునీరు ఇచ్చారని, డబ్బు మూటల కోసమే కేసీఆర్తో జగన్ కుమ్మక్కయ్యారని దేవినేని ఉమా విమర్శించారు. త్వరలో అమరావతిలో ర్యాలీ జరగనున్నట్లు మంత్రి దేవినేని చెప్పారు.