telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

టీడీపీ హయాంలో ఇళ్ల పథకం ఓ కుంభకోణం: మంత్రి బొత్స

ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి టీడీపీ నేతలపై మండిపడ్డారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ఐదేళ్లలో పేదల ఇళ్ల పథకం ఓ కుంభకోణం పథకంలా మారిందని ఆరోపించారు. గతంలో పేదవాడి కడుపుకొట్టి స్కాంలకు పాల్పడ్డ మాజీ సీఎం చంద్రబాబు ఇప్పుడు నీతి బోధలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.గత ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్న సీఎం జగన్ వ్యాఖ్యలను కక్షపూరితమంటూ ఎదురుదాడి చేస్తున్నారని టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు.

కొత్త టెక్నాలజీ పేరు చెప్పి అధిక ధరలకు కాంట్రాక్టులు కేటాయించారని ఆరోపించారు. పేదవాళ్లకు ఎన్ని ఇళ్లు కేటాయించారు? అని బొత్స ప్రశ్నించారు. వైఎస్ హయాంలో ఇరవై ఐదు లక్షల ఇళ్లు కడితే, తామే కట్టినట్టుగా టీడీపీ నేతలు చెబుతున్నారని విమర్శించారు. వైఎస్ హయాంలో ఉచితంగా జీ-ప్లస్ ఇల్లు కేటాయించామని గుర్తుచేశారు. రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలన్నదే సీఎం జగన్ ఉద్దేశమని అన్నారు.

Related posts