కరోనా నియంత్రణలో ప్రజలు భాగస్వామ్యం కావాలని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. అందరూ ఇంటికే పరిమితమైతే కరోనాను తరిమికొట్టవచ్చని మంత్రి వ్యాఖ్యానించారు. విశాఖలో ఇప్పటికి మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు ఆళ్ల నాని ప్రకటించారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు నేడు విశాఖలో పరిస్థితిపై నాని సమీక్ష నిర్వహించారు. కరోనా నియంత్రణకు అధికారులు తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు.
ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో ప్రతిపక్షాలు భాగస్వామ్యం కావాలన్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. మూడో దశకు రాకముందే మనమంతా జాగ్రత్త పడాలన్నారు. కరోనా వ్యాప్తిని నిరోధించడంలో భాగంగా విశాఖలో 20 కమిటీలను ఏర్పాటు చేశామని ఆళ్ల నాని వెల్లడించారు. విశాఖ జిల్లాలో 1470 మంది హోం క్వారంటైన్లో ఉన్నారని తెలిపారు.