తెలంగాణ జాతీయ రహదారుల నిర్మాణంలో కేంద్రం అనుసరిస్తున్న తీరుపై ఎంపీ వినోద్ కుమార్ విమర్శించారు. రహదారుల నిర్మాణంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని అన్నారు.ఏపీలోని జాతీయ రహదారులకు సోమవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేయడంతో పాటు మరో లక్ష కోట్ల కొత్త రహదారులను ప్రకటించారని తెలిపారు. కానీ తెలంగాణ విజ్ఞప్తులను ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. తెలంగాణ భవన్లో ప్రెస్మీట్లో ఎంపీ మాట్లాడుతూ..విభజన చట్టంలోని 13వ షెడ్యూల్లో తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తీర్ణాన్ని పెంచాలని సూచించారని వినోద్ తెలిపారు.
2014లో కేసీఆర్ ఆధ్వర్యంలో ఎంపీలందరితో కలిసి ప్రధాని మోడీ, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీలను కలిశామన్నారు. రాష్ట్రంలో 1385 కిలోమీటర్ల రహదారులను జాతీయ రహదారులుగా గుర్తిస్తూ కేంద్రప్రభుత్వం తెలిపిందని, కానీ అందుకు సంబంధించి ఇంత వరకు అధికారికంగా జీవో విడుదల చేయలేదని వినోద్ అన్నారు. హైదరాబాద్ మహానగరంగా అభివృద్ధి చెందుతున్నందున దృష్ట్యా నగరానికి దూరంగా మరో రీజనల్ రింగ్ రోడ్ను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరామన్నారు.