కరోనా పరీక్ష కేంద్రాల సంఖ్యను పెంచాలని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటలకు ఎంఐఎం విజ్ఞప్తి చేసింది. తమ నియోజకవర్గాల్లో ఉచిత కరోనా టెస్టుల కేంద్రాల సంఖ్యను ఎంఐఎం శాసనసభ్యులు పెంచాలని కోరారు. రోజుకు 1000 ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసే కేంద్రాల సంఖ్యను పెంచాలన్న తమ పాత డిమాండ్ ను కూడా మరోసారి మంత్రికి నివేదించారు. ఎక్కడెక్కడ ఉచిత కరోనా కేంద్రాలు ఉన్నాయో ఆ వివరాలు తెలపాలని కోరారు. ఈ మేరకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ట్విట్టర్ లో వివరాలు తెలిపారు.
నగరంలోని కుమ్మర్ వాడి, తాళ్లకుంట, మిల్లత్ నగర్ బస్తీ దవాఖానాల్లో ఉచిత యాంటీజెన్ టెస్టింగ్ సౌకర్యం కల్పించాలని ఎంఐఎం శాసన సభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ ఆరోగ్యమంత్రిని కోరారని వివరించారు. మలక్ పేట్, నాంపల్లి, కార్వాన్, యాకుత్ పురా, చార్మినార్, బహదూర్ పురా నియోజకవర్గాల్లోనూ కరోనా సౌకర్యాల మెరుగుదలకు చర్యలు తీసుకోవాలంటూ ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు మంత్రికి విజ్ఞప్తులు చేశారని అసదుద్దీన్ ఒవైసీ వెల్లడించారు.