తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికలపై మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ఖాళీ అయిందని, బీజేపీకి స్థానం లేదని అన్నారు. కాబట్టి మునిసిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్సే చాలా చోట్ల తమకు ప్రధాన ప్రత్యర్థి అని ఒవైసీ పేర్కొన్నారు.
మజ్లిస్ ఏ ఒక్క ప్రాంతానికో పరిమితమైన పార్టీ కాదని, అది జాతీయ పార్టీ అని పేర్కొన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు మహారాష్ట్రలో ఇద్దరు ఉన్నారని, అదే రాష్ట్రం నుంచి ఓ ఎంపీ కూడా ఉన్నారని గుర్తు చేశారు. బీహార్ అసెంబ్లీలోనూ తమ పార్టీకి ప్రాతినిధ్యం ఉందన్నారు. టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు లేవని అన్నారు. టీఆర్ఎస్ తో స్నేహపూర్వకంగా ఉంటున్నా, మునిసిపల్ ఎన్నికల్లో ఆపార్టీతో కలిసి పనిచేయాల్సిన అవసరం లేదన్నారు.