దేశంలో తొలి ఉగ్రవాది హిందువేననీ, అతని పేరు నాథూరాం గాడ్సే అని నటుడు, మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం) పార్టీ అధినేత కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలను మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ సమర్థించారు. భారత జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సేను మహాత్ముడని పిలవాలా? లేక రాక్షసుడని పిలవాలా? అని ఒవైసీ ప్రశ్నించారు.
బాపూ గుండెల్లోకి తూటాలు పేల్చినవాడు రాక్షసుడు కాక మంచివాడు ఎలా అవుతాడని అడిగారు. ‘నాథూరాం గాడ్సే లాంటి వ్యక్తిని టెర్రరిస్ట్ అనాలా? లేక హంతకుడు అనాలా? అని ప్రశ్నించారు. గాంధీజీ హత్య విషయంలో కపూర్ కమిషన్ నివేదికలో కుట్ర విషయం తేలిపోయిందన్నారు. కాబట్టి గాడ్సేను టెర్రరిస్ట్ అనే అనాలని, అతడు నిజంగా ఉగ్రవాదే అని ఒవైసీ తేల్చిచెప్పారు.