కళ అనేది దేవుడు ఇచ్చిన వరం.. అది ఎప్పటికైనా బయటకు వస్తుంది. ప్రస్తుతం ఎంతో మంది ఔత్సాహిక కళాకారులు డ్యాన్స్ మాస్టార్లుగా మారి జీవనం కొనసాగిస్తున్నారు. కొరియోగ్రఫర్లుగా వచ్చిన లారెన్స్, ప్రభుదేవ ఇప్పుడు నటులు, దర్శకులుగా మారి తమ సత్తా చాటుతున్నారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. అతి కొద్ది సందర్భాల్లో మాత్రమే అది బయటపడుతుంటుంది. తాజాగా ఎల్ అండ్ టీ సంస్థకు చెందిన ఓ కార్మికుడు చేసిన డ్యాన్స్ కి సోషల్ మీడియాలో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మెట్రోరైల్ పనుల్లో భాగంగా ఓ కార్మికుడు భోజన విరామ సమయంలో సరదాగా తన తోటి కార్మికుల మద్య మైకేల్ జాక్సన్ స్టెప్పులు వేసి తన డ్యాన్స్ తో పిచ్చెక్కించాడు.
హైదరాబాద్ మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఆ కార్మికుడు డ్యాన్స్ చేస్తున్న సమయంలో తోటి కార్మికుడు తీసిన వీడియోను తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. ఆ వ్యక్తి సినిమా నటుడేమీ కాదని.. ఇలాంటి ప్రతిభ కలిగిన కార్మికులు ఉండడాన్ని తాను గర్విస్తున్నానంటూ ఆయన పేర్కొన్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఆ కార్మికుడి డ్యాన్స్ చూసిన పలువురు నెటిజన్లు ఆయన్ను అభినందిస్తున్నారు.
— MD HMRL (@md_hmrl)