telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

ట్రాఫిక్ ఎక్కువ అవుతుండటంతో… మెట్రోరైలు వేగం పెంపు.. తగ్గనున్న ప్రయాణ సమయం..

metro train hyd

తెలంగాణాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఇంకా కొనసాగుతూనే ఉండటంతో ప్రజలు ఎక్కువగా మెట్రో మీదనే ఆధారపడుతున్నారు . దీనితో మెట్రోపై తీవ్రంగా భారం పడుతుంది. ఈ నేపథ్యంలో మెట్రో లభ్యతను పెంచారు. అయినా డిమాండ్ ఉండటంతో తాజాగా మెట్రోరైలు వేగం కూడా పెంచాలని నిర్ణయానికి వచ్చారు. ప్రతీరోజు రద్దీ 4 లక్షలు దాటనున్న నేపథ్యంలో వేగాన్ని పెంచేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని మెట్రో రైలు వర్గాలు తెలిపాయి. కమిషనర్ ఆఫ్ మెట్రోరైలు సేఫ్టీ(సీఎంఆర్‌ఎస్) దృష్టికి వేగం పెంచే అంశాన్ని ఇప్పటికే మెట్రోరైలు సంస్థ తెచ్చింది. అనుమతులు రాగానే ఫ్రీక్వెన్సీ పెంచనున్నారు. ప్రస్తుతం మెట్రోరైలు గంటలకు 35 కిలోమీటర్ల వేగంతో నడుస్తుండగా, దీనిని గంటకు 40 కిలో మీటర్లకు పెంచాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ప్రయోగాత్మకంగా ఇప్పటికే వేగం పెంచి నడిపించారు. అయితే అధికారిక అనుమతులు వచ్చిన వెంటనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో కోచ్‌లు కిక్కిరిసి పోతుండటంతో వేగం పెంచాలని నిర్ణయించారు.

చాలా మంది ప్రయాణికులు మెట్రోరైలు ప్రయాణానికి అలవాటుపడుతుండటం మెట్రో ప్రయాణమే మేలని అభిప్రాయం వ్యక్తం చేస్తుండటంతో మెట్రో ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని మెట్రో అధికారులు అంచనాకు వచ్చారు. సమ్మెకు ముందు ప్రతీరోజు రెండు కారిడార్లలో కలిసి 711 ట్రిప్పులు ఆపరేట్ చేసేవారు. సమ్మె ప్రారంభం అయ్యాక 100 ట్రిప్పులు పెంచి 811 ట్రిప్పులు నడిపిస్తున్నది. అయినప్పటికీ అంచనాకు మించిన ప్రయాణికులతో మెట్రోరైలు కిక్కిరిసిపోతున్నది. రద్దీ సమయంలో 3 నుంచి 4 నిమిషాల ఫ్రీక్వెన్సీతో రైళ్లు నడిపిస్తుండగా, సాధారణ సమయాల్లో 6 నిమిషాలకో రైలు నడిపిస్తున్నారు. అయితే క్రమేపీ మెట్రో ప్రయాణికులు పెరుగుతుండటంతో వేగం పెంచడం ద్వారా మరిన్ని ట్రిప్పులు నడిపించాలన్నదే మెట్రోరైలు వ్యూహమని అధికారులు చెబుతున్నారు.

Related posts