మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే తీసుకున్న మొదటి నిర్ణయం.. ఆరేకాలనీలో ఆందోళనకు కారణమైన మెట్రో కార్షెడ్ ప్రాజెక్టును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై తదుపరి నిర్ణయం తీసుకునే వరకు ఒక్క ఆకు కూడా రాలనివ్వబోమని తెలిపారు. ఇక్కడ చెట్ల నరికివేతను నిరసిస్తూ గల నెల పెద్ద ఎత్తున స్థానికులు, పర్యావరణవేత్తలు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఆరే కాలనీ గురించి తీసుకున్న నిర్ణయం గురించి వివరించారు. ముంబయిలో జన్మించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి వ్యక్తి అయిన తనకు నగరానికి ఏం చేయాలన్నదానిపై స్పష్టత ఉందని చెప్పారు.
ఆరే కాలనీలో మెట్రో కార్ షెడ్ నిర్మాణం కోసం అక్టోబర్లో సుమారు రెండు వేల చెట్లను తొలగించారు. దీనిపై స్థానికులు, పర్యావరణ వేత్తలు నిరసన తెలిపారు. దీంతో 29 మందిని అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారం సర్వోన్నత న్యాయస్థానానికి చేరడంతో కోర్టు స్టే విధించింది. రెండేళ్ల క్రితం కార్ షెడ్ ప్రకటించినప్పుడే దీనిపై వివాదం రాజుకుంది. ఈ నిర్మాణం వల్ల జంతువులు, పక్షులు తమ ఆవాసాన్ని కోల్పోతాయని, పర్యావరణానికి సైతం హాని కలుగుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేశారు.
కాలుష్యంపై బీజేపీ నేతల రాజకీయాలు: కేజ్రివాల్