తెల్లకాగితంపై చిన్న నల్ల చుక్క ప్రభావం ఎక్కువ అన్నది ఎంత సహజమో; అలాగే చెడు కి ప్రచారం ఎక్కువ, మంచికి నిదానం ఎక్కువ అన్నట్టుగానే నేటి సమాజంలో స్త్రీలపై జరిగే అన్యాయాన్ని హైలైట్ చేసి చూపిస్తూ, అసలు మంచివాళ్ళే లేనట్టు అతిగా ప్రచారం చేయడం చూస్తూనే ఉన్నాం. కానీ, మహిళలతో చక్కటి ప్రవర్తనతో ఉన్న పురుషులూ లేకపోలేదనే దానికి ఇదో చక్కటి ఉదాహరణ. కోల్కతాలో జరిగిన ఈ సంఘటనతో మహిళల పట్ల మగవారికి ఉండే సోదరి ప్రేమను చూపుతోంది. కోల్కతాలోని బిజార్రెలో ఓ మహిళ రైలు ప్రయాణంలోనే బిడ్డకు జన్మనిచ్చింది.
ఈ ఘటన అగర్తలా- హబిజ్గంజ్ ఎక్స్ప్రెస్లో జరిగింది. రైలు ఎక్కిన కొద్దిసేపటికే ఆమెకు పురిటి నొప్పులు రావడం జరిగింది. దీనితో కొంత మంది ప్రయాణికులు ఆమెకు సాయం చేసేందుకు ప్రయత్నించగా… ముగ్గురు యువకులు మాత్రం (మహ్మద్ సోహ్రాబ్, సుబాదాద్ గాడ్వా, త్రిభువన్ సింగ్) ఆమెను సొంత తోబుట్టువులా భావించి సేవలందించారు. రైల్లో ఉండే ప్రయాణికుల వద్దకు వెళ్లి కొన్ని బట్టలు సేకరించారు. వాటి సాయంతో ఆమె చుట్టూ కట్టారు.
కానీ రైల్లో డాక్టర్ లేకపోవడంతో.. వారే ఆమెకు పురుడు పోశారు. ఆపై ఆమె పండంటి శిశువుకు జన్మనిచ్చింది దీంతో ఆ యువకులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్రసవం అనంతరం ఆమెకు వైద్యం అవసరమయ్యే పరిస్థితి కనిపించింది. దీని తో రైలు చెయిన్ లాగి స్థానిక స్టేషన్ దగ్గర ఆపారు. అప్పటికే రైల్వే అధికారులకు వారు సమాచారం ఇవ్వడంతో వెంటనే ఆమెకు వైద్య సాయం అందింది. తల్లితో పాటు బిడ్డకు కూడా ప్రాథమిక చికిత్స చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆమెకు వైద్యం అందే వరకు ఆ ముగ్గురు యువకులు అక్కడే ఉండి.. వారు మరో రైలుకు వెళ్లిపోయారు. ఆమెకు సాయం అందించిన యువకుల్నీ ప్రయాణికులతో పాటు రైల్వే సిబ్బంది కూడా మెచ్చుకున్నారు.