ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శలపై బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ట్విట్టర్ లో స్పందించారు. యూపీలో కుల ప్రాతిపదికన కూటమి ఏర్పడిందంటూ ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. కూటమి కులప్రాతిపదికన ఏర్పడిందనడం అవివేకమని అన్నారు. పుట్టుకతోనే మోదీ వెనుకబడిన కులానికి చెందిన వ్యక్తి కాదని, ‘కులం’ పేరిట జరిగే ఏ బాధనూ ఆయన అనుభవించలేదని విమర్శించారు.
అలాంటి వ్యక్తి తమ కూటమి గురించి వ్యాఖ్యలు చేయడం సబబు కాదని అన్నారు. ఒకవేళ మోదీ నిజంగా వెనుకబడిన కులానికి చెందిన వారే అయితే, ఆర్ఎస్ఎస్ ఆయనకు ప్రధాని పదవి ఇచ్చేవారు కాదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీ తన సొంత రాష్ట్రం గుజరాత్ లో దళితుల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలని హితవు పలికారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం ఖాయమని మాయావతి జోస్యం చెప్పారు.