కొద్దిరోజులలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భారీ దాడి చేసేందుకు మావోయిస్టులు కుట్రపన్నారు. పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టడంతో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి లభించింది. దీంతో సరిహద్దు ప్రాంతాలు, అటవీ ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ చేస్తున్నారు. ఈ నెల 21న మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల సంఘం ఓకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో గడ్చిరోలి జిల్లాలో విధ్వంసం సృష్టించేందుకు మావోయిస్టులు వ్యుహరచన చేశారు. మావోయిస్టుల కుట్రను కొందరు పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు.
మావోయిస్టుల శిబిరంలో 15 చేతి గ్రనేడ్లు, 15 జిలేటిన్ స్టిక్స్, ఒక ప్రెషర్ కుక్కర్ బాంబ్, ఆరు కిలోల మందుగుండు, ఐఈడీ డిటోనేటర్, ఆర్ఎఫ్ఐడీ స్విచ్, మావోయిస్టుల సాహిత్యం, యూనిఫామ్స్ లభించాయి. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు బీజేపీ-శివసేన కూటమి, కాంగ్రెస్-ఎన్సీపీ బరిలోకిదిగాయి. బీజేపీ 164, శివసేన 124 చోట్ల పోటీ చేస్తామని స్పష్టతనిచ్చాయి. అయితే కాంగ్రెస్, ఎన్సీపీల నుంచి కీలక నేతలు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో ఆ పార్టీలు బలమైన అభ్యర్థుల వేటలో పడిపోయాయి. బీజేపీ-శివసేన కూటమికి గట్టి మద్దతిచ్చేందుకు ప్రయత్నిస్తోంది.