ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఇకపై విద్యార్థులకు గ్రేడ్లతో పాటు మార్కులు కేటాయించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ జీవో 55 విడుదల చేశారు. 2019-20 విద్యాసంవత్సరం నుంచి ఇది వర్తిస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో 6 నుంచి 10వ తరగతి వరకు గ్రేడింగ్ విధానం అమల్లో ఉంది. 2018-19 వరకు టెన్త్ పబ్లిక్ పరీక్షలలో గ్రేడింగ్ విధానం అమలు చేశారు.
ఎక్కువమంది విద్యార్థులకు ఒకే గ్రేడ్ వచ్చినప్పుడు ప్రవేశాలు, నియామకాల్లో సమస్యలు వస్తున్నాయని ఈ నేపథ్యంలోనే మార్కులు ఇవ్వాలని ప్రతిపాదనలు సమర్పించినట్లు వెల్లడించారు. కరోనా కారణంగా 2019-20, 2020-21 సంవత్సరాల విద్యార్థులకు టెన్త్ పబ్లిక్ పరీక్షలు జరగలేదు. దీంతో విద్యార్థులు ఆయా తరగతుల్లో ఏడాదిపాటు నిర్వహించిన పరీక్షల్లో అంతర్గత మార్కుల ఆధారంగా టెన్త్ ఫలితాలు ప్రకటించారు.
హైపవర్ కమిటీ సూచనల మేరకు ఈ ఫలితాలను ఇచ్చారు. హైపవర్ కమిటీ సూచన మేరకు విద్యార్థులకు గ్రేడ్లతో పాటు మార్కులను కూడా అవార్డు చేయనున్నారు. పై చదువులకు, ఉపాధి అవకాశాలకు మెరిట్ నిర్ణయించేటప్పుడు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు 2019-20 బ్యాచ్ నుంచి టెన్త్ విద్యార్థులకు పబ్లిక్ పరీక్షల్లో గ్రేడ్లతో పాటు మార్కులు కూడా ఇస్తారు.