ప్రముఖ నటుడు మంచు మనోజ్ కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు తగిన ప్రాధాన్యం దక్కని నేపథ్యంలో ప్రధాని మోదీపై ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మేం మీకు మద్దతుగా నిలిచాం. మీ పోరాటంలో తోడుగా నడిచాం. ఇన్నాళ్లు మా ఆశల్ని నెరవేరుస్తారని ఎదురు చూశాం. కానీ మీ నుంచి సరైన స్పందన రాలేదు. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడమేకాక బడ్జెట్లో కనీస గౌరవం కూడా దక్కలేదు. సమయం ఆసన్నమైంది. మా డిమాండ్ను గౌరవిస్తూ.. ఇప్పటికైనా ప్రత్యేక హోదా మంజూరు చేయండి. తిరుపతి బాలాజీ సాక్షిగా చేసిన హామీని నేరవేర్చకపోతే ఆయన ఆగ్రహానికి గురికాక తప్పదు’ అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు.
శుక్రవారం నాడు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని, విభజన హామీలు, ప్రత్యేక హోదాకు సంబంధించి ఎటువంటి ప్రస్తావన లేకపోవడం తెలిసిందే. దీనిపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహా, దేశంలోని పలు పార్టీలు నిరసన వ్యక్తం చేశాయి.