బెంగళూరుకు చెందిన మనోజ్ అనే యువకుడు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం ఎదురుగా, ఓ హిజ్రాను వేదమంత్రాల సాక్షిగా, హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నాడు. ఓ బీమా కంపెనీలో పని చేస్తున్న మనోజ్ కు సబీ అనే హిజ్రాతో పరిచయం కాగా, అది కాస్త ప్రేమగా మారింది. వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
బెంగళూరు నుంచి దాదాపు పది మంది హిజ్రాలు, వారి స్నేహితులు అమ్మవారి ఆలయం వద్దకు చేరుకుని, మహద్వారం ముందు పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లికి స్థానిక అర్చకుడొకరు సాయం చేశారు. ఇతర హిజ్రాల కేరింతలు, ఆనందోత్సాహాల మధ్య సబీ, మనోజ్ ల వివాహం జరుగగా, ఆపై రాత్రి పది గంటల సమయంలో ఏకాంత సేవలో పద్మావతి అమ్మవారిని ఈ నూతన జంట దర్శించుకుంది.