కేంద్రం ప్రభుత్వం ఇటీవలే ఫాస్టాగ్ను తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఫాస్టాగ్ లేకుంటే టోల్ గేట్ ఛార్జీలను డబుల్ వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాహనాదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. జీపీఎస్ ఆధారిత టోల్ వ్యవస్థను త్వరలో తీసుకురానున్నట్లు కేంద్ర రవాణా, రహదారుల శాఖల మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. జాతీయ రహదారిపై ప్రవేశించిన పాయింట్ నుంచి దిగిపోయిన పాయింట్ వరకు ప్రయాణించిన వరకే టోల్ చార్జీలను ఇందులో చెల్లించవచ్చని అన్నారు. కాకపోతే ఈ వ్యవస్థ రావడానికి రెండేళ్లు పట్టవచ్చని పేర్కొన్నారు. జాతీయ రహదారులపై టోల్ వసూళ్ల కోసం ఫాస్టాగ్ విధానాన్ని తప్పనిసరి చేయడం వల్ల వాహనాల రద్దీ గణనీయంగా తగ్గినట్లు తెలిపారు. దీని వల్ల ప్రతి ఏటా రూ. 20 కోట్ల మేర ఇంధనం రూపంలో ఆదా అవుతుందని, కనీసం రూ. 10 వేల కోట్ల మేర ఆదాయం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
previous post
next post