ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమంటూ ఏపీ శాసనసభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పడాన్ని ఖండించారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. వర్గీకరణ విషయంలో జగన్ మాట తప్పారని, మడమ తిప్పారని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణను ఎంపీగా ఉన్న సమయంలో మొదట సమర్థించి, కమిషన్ వేయించిందీ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డేనని చెప్పారు.
జగన్ స్వయంగా వర్గీకరణపై ప్రధానికి లేఖ రాసిన విషయం.. పార్టీ ప్లీనరీలో తీర్మానం చేసిన విషయం వాస్తవం కాదా?అంటూ ఆయన ప్రశ్నించారు. జగన్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోని పక్షంలో గుంటూరు నుంచి అసెంబ్లీకి వర్గీకరణ సాధనయాత్ర చేపట్టనున్నామని చెప్పారు. ఎస్సీ వర్గీకరణపై వైఎస్ తోపాటు జగన్ వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలను, లేఖలను ఆయనకు చూపేందుకు ఈ యాత్ర చేపడతామని ఆయన చెప్పారు.