వరంగల్ జిల్లా హన్మకొండలో జరిగిన తొమ్మిది నెలల చిన్నారి శ్రీహిత హత్యాచార ఘటన మరవకుముందే హైదరాబాద్ లో అలాంటి ఘటనే మరోటి చోటుచేసుకుంది. సొంత మేనమామే ఓ ఏడేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. పాపను ఆడిస్తానని చెప్పి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని బుద్వేల్లో శుక్రవారం వెలుగుచూసింది.
ఖమ్మం జిల్లాకు చెందిన చిన్నారి కుటుంబం అక్కడి నుంచి వచ్చి బుద్వేల్లో నివాసముంటోంది. చిన్నారికి మాయ మాటలు చెప్పి భవనం పైకి తీసుకెళ్లిన కీచక మేన మామ సందీప్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న చిన్నారి తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సందీప్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.