దుబాయి మెట్రో స్టేషన్లో మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన నైజీరియన్కు దుబాయి కోర్టు గురువారం మూడు నెలల జైలు శిక్ష విధించింది. ఫిలిపినాకు చెందిన 23 ఏళ్ల మహిళ జూలై 19న దుబాయి మెట్రో స్టేషన్కు వెళ్లింది. అక్కడ ఉన్న నైజీరియాకు చెందిన ఓ వ్యక్తి ఆమెను తాకరానిచోట తాకుతూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దాంతో ఆమె నైఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వేళ్తే… బాధిత మహిళ సేల్స్వుమెన్గా పని చేస్తోంది. జూలై 19న డ్యూటీ ముగియడంతో తిరిగి ఇంటికి వెళ్లేందుకు రాత్రి 11 గంటల ప్రాంతంలో బాని యాస్ మెట్రో స్టేషన్కు వెళ్లింది. బేస్మెంట్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కు వెళ్లేందుకు మహిళ ఎలక్ట్రిక్ మెట్లు ఎక్కుతుండగా వెనక నుంచి వచ్చిన నైజీరియన్ ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. అతడి చర్యతో భయపడిపోయిన బాధితురాలు గట్టిగా అరిచింది. దాంతో ఆమెను వదిలిపెట్టి బని యాస్లోని ఓ హోటల్లోకి వెళ్లిపోయాడు. బాధితురాలు కూడా అతడ్ని అనుసరించి ఆ హోటల్కు వెళ్లింది. ఆమెను చూసిన నిందితుడు నన్ను ఎందుకు ఫాలో చేస్తున్నావంటూ మహిళపై అరిచాడు. నీకు డబ్బు గాని మద్యం గాని కావాలా? అంటూ ప్రశ్నించాడు. దానికి ఆమె నాకేం వద్దు.. నీవు చేసిన పనికి పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పింది. దాంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. మహిళ ఫిర్యాదు మేరకు హోటల్కు వచ్చిన పోలీసులు రిసెప్షనిస్ట్ అడిగి నిందితుడి సమాచారం తెలుసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని గురువారం దుబాయి న్యాయస్థానంలో హాజరుపరిచారు. మొదట తాను ఆమెను అసలు ముట్టుకోలేదని బుకాయించిన నిందితుడు ఆ తరువాత తన నేరాన్ని అంగీకరించాడు. దీంతో న్యాయస్థానం అతడికి మూడు నెలల జైలు శిక్ష విధించింది.