ప్రభుత్వ కార్యాలయాలలో ఏ చిన్నపని కావాలన్నా కూడా లంచం ఇవ్వక తప్పని పరిస్థితి చాలా చోట్ల ఉంది. తాజాగా, మరో ప్రబుద్దుడి నిర్వాకం వెలుగులోకి వచ్చింది. అదేమంటే, లంచం అడిగిన తహసీల్దార్కు ఓ రైతు దిమ్మతిరిగే రీతిలో సమాధానమిచ్చాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఖర్గాపూర్లో చోటు చేసుకుంది. దేవ్పూర్ గ్రామానికి చెందిన 50 ఏళ్ల రైతు లక్ష్మీ యాదవ్ తన ఇద్దరి కోడళ్ల పేరుతో కొంత భూమిని కొనుగోలు చేశాడు. ఈ భూమికి సంబంధించిన యాజమాన్య హక్కుల బదలాయింపు, ఇతర పనుల కోసం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాడు.
అక్కడ తహసీల్దార్ లక్ష్మీయాదవ్ను లక్ష రూపాయలు లంచం రూపంలో ఇవ్వాలని డిమాండ్ చేశాడు. చివరికి యాదవ్ రూ.50,000 చెల్లిస్తానని బతిమాలాడు. కానీ ఆ రెవెన్యూ అధికారి మరో రూ.50వేలు ఇవ్వాల్సిందేనని తెగేసి చెప్పాడు. లక్ష్మీయాదవ్ వద్ద అంత సొమ్ము లేదు. అతడు చేసేది లేక తన బర్రెను తీసుకెళ్లి సదరు అధికారికి ప్రభుత్వం కేటాయించిన వాహనానికి కట్టేశాడు. అక్కడి వచ్చిన ప్రజలు లక్ష్మీయాదవ్ పరిస్థితి చూసి సదరు అధికారిని అసహ్యించుకున్నారు. ఈ విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్లింది. వెంటనే ఆయన ఈ ఘటనపై దర్యాప్తు చేయడానికి మరో అధికారిని నియమించారు. ఈ దర్యాప్తులో అధికారి లంచం డిమాండ్ చేసినట్లు ప్రాథమికంగా తేలింది.