దేశరాజకీయాలలో ఈ సారి ఎన్నికలు ప్రాధాన్యతనుఁ సంతరించుకున్నాయి. అధికార బీజేపీని గద్దె దించేందుకు దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలు ఏకమై కూటమిగా ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య కూడా ఉంది. ఈ కూటమి అధికారంలోకి వస్తే, ప్రధాని ఎవరన్నది అది. దీనికి రాహుల్ అని టక్కున జవాబు ఇవ్వడం కాంగ్రెస్ కు కుదరని పరిస్థితి. దీనితో ప్రధాని అభ్యర్థి ఎవరు అనే ప్రశ్న తలెత్తుతుంది. ఈ జాబితాలో తాను ఉండాలి అంటూ నిరసనలకు దిగిన మమతా కాస్త వెనక్కి తగ్గినట్టే ఉంది. ఏమంటే ఆమె తాజాగా, ప్రధాని పదవి ఎవరిదన్న విషయమై కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని పదవికి రాహుల్ తో పాటు చంద్రబాబు, శరద్ పవార్, ఫరూఖ్ అబ్దుల్లా తదితరులంతా ఉన్నారని చెప్పారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసి వచ్చిన తరువాత ఆమె మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు ముందే పొత్తులపై పూర్తి అవగాహన కుదుర్చుకుంటామని చెప్పారు. రాష్ట్రాల్లోని పరిస్థితులను బట్టి పొత్తులు ఉంటాయని అన్నారు. రాష్ట్రాల్లో వ్యతిరేకించుకున్నా, జాతీయ స్థాయిలో కలసి పనిచేస్తామని అన్నారు. తాను కేసీఆర్ తో కూడా మాట్లాడానని, ఆయన కూడా కూటమిలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. తాను ప్రధాని పదవిని కోరుకుంటున్నట్టు అసత్య ప్రచారం జరుగుతోందని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. తాను స్వైన్ ఫ్లూతో బాధపడుతూ ర్యాలీ చేస్తానని అమిత్ షా చెబితే, ఎలా అనుమతిస్తామని మమత ప్రశ్నించారు. మొత్తానికి కాంగ్రెస్ మమతా ను దారికి తెచ్చేసుకుందన్నమాట!!