కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమలులోకి తెచ్చిన ట్రాఫిక్ చట్టం అమలు పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం తీసుకొచ్చిన ట్రాఫిక్ చట్టాన్ని, జరిమానాలను తాము అమలు చేసేది లేదని కేంద్రం నిర్ణయించిన జరిమానాలపై బీజేపీ పాలిత గుజరాత్ ప్రభుత్వం పెద్ద మొత్తంలో కోత విధించిన నేపథ్యంలో మమత ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
జరిమానాల రూపంలో సామాన్యులపై మోయలేని భారం పడుతుందన్న అధికారుల అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్నానన మమత తెలిపారు. అందుకే ఈ చట్టాన్ని అమలు చేయడం లేదని ఆమె వెల్లడించారు. కాగా, తాము సైతం గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించిన జరిమానాలను అమలు చేస్తామని కర్ణాటక సీఎం యడియూరప్ప ప్రకటించడం గమనార్హం. మరోవైపు ఈ చట్టం అమలును తమ రాష్ట్రంలో తాత్కాలికంగా నిలిపివుంచామని మహారాష్ట్ర రవాణా మంత్రి దివాకర్ రావోత్ ప్రకటించారు.