కశ్మీర్ గురించి మాట్లాడేవారిని అణచి వేస్తున్నారని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. కశ్మీర్ అంశంలో అసమ్మతి తెలుపుతున్న వారిని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అణచివేస్తోందని అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న తనను అరెస్ట్ చేసినా భయపడబోనని, బీజేపీ ముందు తల వంచనని తెలిపారు. కశ్మీర్లోని వాస్తవ పరిస్థితి గురించి మాట్లాడేవారిని బీజేపీఅణగదొక్కుతుందన్నారు.
ముఖ్యమైన ప్రభుత్వ సంస్థలకు కూడా తమకు అనుకూలంగా ఉన్న రిటైర్డ్ వ్యక్తులను నియమించుకుంటున్నారని అన్నారు. వారు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తున్నారని చెప్పారు. భారతదేశం అధ్యక్ష పాలనవైపుగా పయనిస్తోందని అన్నారు. ఒకవేళ అదే జరిగితే దేశంలో ప్రజాస్వామ్యానికి చోటుండదని చెప్పారు. ప్రతిపక్ష నేతలను బెదిరించడం, లేకపోతే డబ్బుతో కొనుగోలు చేయడం వంటివి చేస్తున్నారని విమర్శించారు.