మల్లన్నసాగర్ నిర్వాసితుల పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ప్రాజెక్టును ఆపే ప్రసక్తే లేదని హైకోర్టు స్పష్టం చేసింది. పరిహారం తీసుకోవాలని నిర్వాసితులకు సూచించింది. కొన్ని లక్షల ఎకరాలకు సంబంధించిన ప్రాజెక్టును కేవలం రెండు మూడెకరాలు ఉన్న భూయజమానుల కోసం ఆపలేమని స్పష్టం చేసింది. పరిహారం చెల్లింపులో అన్యాయం జరిగితే తమ వద్దకు రావచ్చని కోర్ట్ సూచించింది.
పరిహారం తీసుకోవడానికి నిరాకరించిన 60 మంది నిర్వాసితుల పరిహారాన్ని వారి లాయర్లకు అందజేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా నిర్వాసితులకు పరిహారాన్ని అందజేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన 175 కేసులను హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించాలన్న ప్రభుత్వ పిటిషన్ను హైకోర్టు అంగీకరించింది. ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసుకోవచ్చని పేర్కొంది.