ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు అశోక్ గల్లా హీరోగా రూపొందుతున్న తొలి సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఆదివారం రామానాయుడు స్టూడియాలో ప్రారంభమైన ఈ వేడుకకు ఘట్టమనేని, గల్లా కుటుంబసభ్యులతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖుల హజరయ్యారు. సీనియర్ హీరో కృష్ణ, హీరోలు రామ్చరణ్, రానాలు ముఖ్య అతిథులుగా ఈ వేడుకలో పాల్గొన్నారు. హీరోహీరోయిన్లపై రామ్చరణ్ క్లాప్ నివ్వగా.. హీరో రానా కెమెరా స్విచ్చాన్ చేశాడు. సీనియర్ హీరో కృష్ణ చిత్రయూనిట్కు మూవీ స్క్రిప్ట్ను అందజేశారు. తన మేనల్లుడి సినిమా లాంచింగ్ కావడంతో మహేష్ ట్విట్టర్లో స్పందించాడు. ఈ సందర్భంగా తన మేనల్లుడికి, చిత్ర యూనిట్కు శుభాకాంక్షలు తెలిపాడు.
అశోక్ గల్లా తొలి చిత్రం అధికారికంగా ప్రారంభమైంది. ఇది నీ జీవితంలో బిగ్ డే. అంతా మంచే జరగాజరగాలని శుభాకాంక్షలు తెలుపుతున్నా. కష్టపడి పనిచేయ్, నీ శక్తి మేరకు ప్రయత్నించు.. విజయం నీ వెనకాల వస్తుంది. చిత్ర యూనిట్కు గుడ్ లక్ అంటూ మహేష్ ట్వీట్ చేశాడు. ‘భలే మంచి రోజు, శమంతక మణి, దేవదాస్’వంటి చిత్రాలతో కమర్షియల్ హిట్స్ దక్కించుకున్న శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఇక ఈ చిత్రంలో అశోక్ సరసన ‘ఇస్మార్ట్’ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు. అమర్రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై పద్మావతి గల్లా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతమందిస్తున్నాడు. నరేశ్, సత్య, అర్చనా సౌందర్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.