telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ధనుష్ “అసురన్”కు మహేష్ ప్రశంసలు

Mahesh

కోలీవుడ్‌లో దర్శకుడు వెట్రిమారన్‌, ధనుష్‌ కాంబినేషన్‌ అంటేనే వైవిధ్యమైన సినిమాను తెరకెక్కిస్తారనే అంచనాలు బోలెడు ఉంటాయి. వీరి కాంబినేషన్‌లో తాజాగా నాలుగో చిత్రంగా ‘అసురన్‌’ రూపొందింది. మలయాళ సీనియర్‌ నటి మంజు వారియర్‌ ఈ చిత్రం ద్వారా తమిళంలోకి అడుగు పెట్టారు. ప్రకాశ్‌రాజ్‌, పశుపతి, పవన్‌, యోగిబాబు, ఆడుగలం నరేన్‌, తలైవాసల్‌ విజయ్‌, గురు సోమసుందరంలు, దర్శకులు బాలాజీ శక్తివేల్‌, సుబ్రహ్మణ్య శివలు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ నెల నాలుగో తేదీన విడుదలైన ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. సూపర్‌స్టార్ రజినీకాంత్ అల్లుడు, తమిళ ప్రముఖ హీరో ధనుష్ ఈ చిత్రంలో హీరోగా నటించారు. కాగా ‘అసురన్’కు అన్నివైపుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. సామాన్యులతోపాటు సినీ ప్రముఖులు కూడా `అసురన్` సినిమాను అభినందిస్తున్నారు. భూ తగాదా నేపథ్యంలో రూరల్ రివేంజ్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో ధనుష్ ద్విపాత్రాభినయం చేశాడు. తాజాగా ఈ సినిమాను టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు వీక్షించారు. అనంతరం ట్విటర్ ద్వారా చిత్రంపై ప్రశంసలు కురిపించారు. ‘అసురన్.. సమాజంలోని వాస్తవ పరిస్థితులను లోతుగా చూపించింది. సినిమా అద్భుతంగా ఉంది. ధనుష్‌కు, వెట్రిమారిన్‌కు, ప్రకాష్ రాజ్‌కు, చిత్రబృందం మొత్తానికి అభినందనలు’ అని మహేష్ ట్వీట్ చేశారు.

Related posts