telugu navyamedia
ట్రెండింగ్ సామాజిక

భోళాశంకరుని .. ఇలా మీ మనసులకు కట్టేసుకోవచ్చు.. !

mahasivaratri fasting and benefits

ఓం నమః శివాయ.. అంటూ శివనామ స్మరణంలో, శివభక్తి తత్పరతలో 24 గంటలూ పరవశించే పవిత్రమైన రోజు మహాశివరాత్రి పర్వదినం. ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రి వస్తుంది. శివరాత్రి రోజు ప్రకృతిలో ఉండే తరంగాలు, అంతరిక్షం నుంచి వెలువడే కాస్మిక్ కిరణాలు విశ్వమానవ వికాసానికి, మనిషి తన పరిపూర్ణమైన రూపాన్ని తెలుసుకోవడానికి, ఆత్మ సాక్షాత్కారానికి తోడ్పడుతాయి. అందుకే శివరాత్రికి కొన్ని ప్రత్యేక నియమాలు ఆచరించమని చెబుతారు.

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివరాత్రి జాగరణకు విశేష ప్రాధాన్యత ఉంది. ఉపవాసం అనగా దగ్గరగా ఉండడం అని అర్థం. భగవంతుడికి, మనస్సుకు, ఇంద్రియాలను దగ్గరగా జరపడమే ఉపవాసం. ఉపవాసం శరీరంలో, మనసులో ఉన్న విష పదార్థాలను తొలగించడంతోపాటు శరీరంలో ప్రాణశక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది. ఉపవాసం అంటే భగవంతునితో, ఆయన ఆలోచనలతో, ఆయనకు సంబందించిన విషయాలు మాట్లాడుతూ, పాడుకుంటూ, భజిస్తూ .. రోజంతా గడపాలి. ఇలా శరీరాన్ని కష్టపెడుతూ కూడా భగవంతునిపై మనసు పెట్టగలిగితే, మరణం ఆఖరి క్షణం కూడా భగవంతుని నామం చెప్పగలం. అలా చెప్పడం వలన కలిగే ప్రయోజనాలు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఉపవాసం నుంచి చిన్న పిల్లలకు, ముసలివాళ్లకు, గర్భవతులకు, ఔషధ సేవనం చేయాల్సిన వాళ్లకు మినహాయింపు ఉంది. ఉపవాసం ఉండే ముందు రోజు, ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం, గుడ్డు మొదలైనవి తినకూడదు. మద్యపానం చేయకూడదు. ఉపవాసం ఉండే రోజు ముందే లేచి, స్నానాదికాలు పూర్తిచేసుకొని, ఈ రోజు తాను శివుడికి ప్రీతికరంగా శివరాత్రి ఉపవాసం చేస్తున్నానని సంకల్పం చెప్పుకోవాలి.

ఉపవాసం ఉన్నప్పుడు బియ్యం, ఇతర ఆహార పదార్థాలు ఎంత మిగులుతాయో అవి ఆకలితో ఉన్న పేదలకు పంచాలి. అష్టమూర్తి తత్వంలో శివుడు లోకంలో జీవుల రూపంలో సంచరిస్తూ ఉంటాడు. అన్నార్తుల ఆకలిని తీర్చడం కూడా ఆ ఈశ్వర సేవే, అందుకే స్వామి వివేకానంద జీవారాధనే శివారాధన అన్నారు. ఉపవాస నియమాలు కూడా అదే చెబుతున్నాయి. రోజు ప్రకృతిలో ఉన్న శివశక్తిని శరీరం గ్రహించాలంటే, వెన్నును నిటారుగా పెట్టి కూర్చోవాలి. అంటే కూర్చునే సమయంలో ముందుకు వంగి కూర్చోవడం లాంటివి చేయకుండా, వెన్నుపూస నిటారుగా ఉండేలా కూర్చోవాలి, లేదా నిలబడాలి.

శివరాత్రికి చేసే మౌనవ్రతం చాలా అద్భుత ఫలితాలను ఇస్తుంది. మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. మౌనం అనగానే నోరు మూసుకుని కూర్చోవడం అని భావించవద్దు. వ్రతంలో త్రికరణములు ఏకం కావాలి. మనుస్సును మౌనం ఆవరించినప్పుడు మౌనవ్రతం సంపూర్ణమవుతుంది. అందువల్ల అనవసరమైన ఆలోచనలను, వాదనలను కట్టిపెట్టి, మనస్సును శివుడిపై కేంద్రీకరించాలి. అవసరమైతే శివాలయానికి వెళ్లాలి. అక్కడ రుద్రాభిషేకం చేస్తారు. రుద్రం ఒకసారి చదవడానికి అరగంట పడుతుంది. అభిషేకం చేయించుకోకపోయినా పరవాలేదు. శివాలయంలో ప్రశాంతంగా కళ్లు మూసుకుని కూర్చుని పండితులు రుద్ర నమకచమకాలను వింటే సరిపోతుంది.

శివుడు అభిషేక ప్రియుడు. శివుడికి కాసిన్ని నీరు పోసినా పొంగిపోతాడు. శివరాత్రిరోజు అర్చించడం, అభిషేకించడం వల్ల, సదాశివుడి అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుందని భక్తుల నమ్మకం.

శివరాత్రికి చేసే జాగరణ మనలో ఉన్న శివత్వాన్ని జాగృతం చేస్తుంది. తమస్సును తొలగిస్తుంది. సినిమాలు చూస్తూనో, పిచ్చి కబుర్లు చెప్పుకుంటూనో, కాలక్షేపం చేస్తూనో జాగరణ చేయరాదు. దానికి బదులుగా శివారాధన, శివనామస్మరణ లో జాగరణ చేయాలి.

శివరాత్రి మొత్తం శివనామంతో, ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మహామంత్ర జపం లేదా స్మరణతో జాగరణ మీలో నిక్షిప్తమై ఉన్న అనంతమైన శక్తిని జాగృతం చేస్తుంది. శివోహం అనే భావనను కలిగిస్తుంది.

శివరాత్రి మరునాడు ఉదయం శివాలయాన్ని సందర్శించి ప్రసాదం తీసుకున్న అనంతరం భోజనం చేసి ఉపవాస వ్రతం ముగించాలి. శివరాత్రినాడు ఉపవాసం, జాగరణ చేసినవారు తరువాతి రోజు రాత్రి వరకు నిద్రించకూడదు. అప్పుడే సంపూర్ణ ఫలం దక్కుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. భోళాశంకరా.. శివోహం..!

Related posts