మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే ప్రైవేటు నివాసం వద్ద కలకలం చెలరేగింది. ముంబై, బాంద్రాలోని ఆయన నివాస గృహం ‘మాతోశ్రీ’ సమీపంలో టీ అమ్మే వ్యక్తికి కరోనా సోకింది. ఉద్ధవ్ భద్రతా సిబ్బందితో పాటు ఇతర సిబ్బంది అతడి వద్దే టీ తాగుతారు.
దీంతో దాదాపు 170 మంది స్టేట్ రిజర్వ్ పోలీసులతో పాటు ఇతరులను అక్కడి నుంచి పంపించేశారు. వారందరినీ ఉత్తర భారతీయ సంఘం భవనంలో క్వారంటైన్లో ఉంచినట్లు అక్కడి అధికారులు తెలిపారు. సీఎం నివాస ప్రాంతంలో ముంబై మున్సిపల్ సిబ్బంది శానిటైజ్ పనులు ప్రారంభించారు.ఆ ప్రాంతంలోకి ఎవరినీ రాకుండా అధికారులు ఆంక్షలు విధించారు.
టీ అమ్మే వ్యక్తి ఇటీవల జ్వరం, దగ్గు, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు పడుతుండడంతో ముంబైలోని ఓ ఆసుపత్రిలో అతడిని చేర్పించారు. దీంతో అతనికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. అంతకు ముందు అతని టీ స్టాల్ వద్ద ఉద్ధవ్ థాకరే భద్రతా సిబ్బంది టీ తాగారు. వారిలో కరోనా లక్షణాలు కనపడకపోయినప్పటికీ వారిని క్వారంటైన్లో ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.