మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు ఇంకా కొలిక్కి రానట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి రెండు వారాలు గడిచిపోయాయి. అక్కడ ప్రభుత్వం ఏర్పాటులో జరుగుతున్న జాప్యం నేపథ్యంలో ఎన్సీపీ నేత శరద్ పవార్ స్పందించారు. రాష్ట్రంలో అమిత్ షా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి సామర్థ్యం నిరూపించుకోవాలన్నారు.
బీజేపీకి సంఖ్యా బలం లేని రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో అమిత్ షాకు ప్రత్యేక గుర్తింపు ఉందని, అమిత్ షా తన రాజకీయ సత్తాను మహారాష్ట్రలో కూడా ప్రదర్శించాలని పవార్ అన్నారు. శివసేనతో తాము పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేశారు. ప్రతిపక్షంలోనే కూర్చుంటామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమే పైచేయి సాధించినప్పటికి సీఎం పదవి విషయంలో ఇరు పార్టీల మధ్య సఖ్యత కుదరడం లేదు.