మహారాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. రేపు బలపరీక్ష జరుగనున్న నేపథ్యంలో సీఎం పదవికి దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేశారు. దీంతో మహారాష్ట్రను మరో ఐదేళ్ల పాటు పరిపాలించాలన్న బీజేపీ ఆశలు ఆవిరయ్యాయి. మీడియా సమావేశంలో ఫడ్నవీస్ మాట్లాడుతూ కాసేపట్లో గవర్నర్ కు రాజీనామా లేఖను సమర్పిస్తామని ఆయన చెప్పారు. . ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి, వారిని లాక్కునే ప్రయత్నాలు తాము చేయబోమని తెలిపారు.
శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలసి మంచి పాలన అందిస్తాయని ఆశిస్తున్నానని ఫడ్నవీస్ తెలిపారు. అయితే, ఆ మూడు పార్టీల విధానాలు, సిద్ధాంతాలు వేర్వేరని అన్నారు. ఎన్నికల ముందు ఒకరకంగా, ఫలితాల తర్వాత మరో రకంగా శివసేన వ్యవహరించిందని విమర్శించారు. ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారని, అలాంటి ప్రభుత్వం ఎంతో కాలం మనగలలేదని జోస్యం చెప్పారు. .