నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ-నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమశ్శివాయ..
మహాశివరాత్రి పరమశివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. అందుకే శివరాత్రి పర్వదినం రోజు రమశివుడి భక్తులు ఉపవాసం, జాగరణ చేస్తుంటారు. పరమేశ్వరుడు శివలింగంగా ఆవిర్భవించింది ఈ రోజే. పార్వతిని వివాహం చేసుకున్నది కూడా ఇదే రోజు. అందుకే శివనామస్మరణతో శివుడికి దగ్గరగా ఉంటే ఆయన కటాక్షం పొందవచ్చని వేద పురాణాలు చెప్తున్నాయి.
సంవత్సరానికి 12 శివరాత్రిలు ఉంటాయి కానీ ఫాల్గుణ మాస శివరాత్రి అత్యంత ముఖ్యమైనది. మహాశివరాత్రి ప్రదోష కాలంలో శంకర్-పార్వతి వివాహం జరిగిందని నమ్ముతారు. ప్రదోష కాలంలో అన్ని జ్యోతిర్లింగాలు మహాశివరాత్రి నాడు దర్శనమిచ్చాయి.
శివరాత్రి వ్రత కథ విశిష్ఠత..
సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడే శివరాత్రి వ్రత ప్రభావాన్ని పార్వతీదేవికి ఈ కథ ద్వారా చెప్పాడు. పూర్వం ఓ పర్వత ప్రాంతంలో ఒక బోయవాడు ఉండేవాడు. ఉదయాన్నే వేటకు వెళ్లడం.. సాయంకాలానికి ఏదోఒక మృగాన్ని చంపి దానితో తన కుటుంబాన్ని పోషించటం ఆయన దినచర్య. అయితే ఓ రోజు ఉదయమే వెళ్లిన ఆ బోయకు చీకటిపడే వేళైనా ఒక్క జంతువూ దొరకలేదు. దాంతో ఆయన నిరాశగా ఇంటిముఖం పట్టాడు. అలా వస్తుండగా అతడికి దారిలో ఒక సరస్సు కనిపించింది. రాత్రిపూట ఏదైనా జంతువు అక్కడికి నీళ్లు తాగడానికి వచ్చి తీరుతుందని.. అప్పుడు దాన్ని తాను సంహరించవచ్చని అనుకొని ఆ సరస్సు పక్కనే ఉన్న ఒక చెట్టెక్కి కూర్చున్నాడు. తనకంటి చూపునకు అడ్డంగా ఉండటంతో ఒక కొమ్మ ఆకులను తుంచి కిందపడవేశాడు. ఆ బోయవాడు ఊతపదంగా శివ శివ అంటుండేవాడు. అలా అనడం మంచో చెడో అతడికి తెలియదు. కానీ.. ఆ సమయంలో అలా అంటూనే కాలం గడిపాడు. అలా గడిపిన రాత్రి శివరాత్రి పర్వదినమని కూడా తెలియదు ఆ బోయవాడికి.
రాత్రివేళ మొదటి జాము గడిచాక ఒక ఆడజింక నీళ్లు తాగేందుకు అటుగా వచ్చింది. దాని మీదకు బాణాన్ని ఎక్కుపెట్టాడు బోయ వాడు. అయితే ఆ జింక తాను గర్భం దాల్చానని.. తనను చంపటం అధర్మమంటూ వదిలిపెట్టమని ప్రాధేయపడింది. మామూలుగా అయితే అతడి మనసు క్రూరంగా ఉండేదే. కానీ ఆ జింకను చూడటం.. పైగా అది మానవభాష మాట్లాడేసరికి బోయవాడు దాన్నేమీ చేయలేకపోయాడు. అలా రెండోజాము కూడా గడిచింది. అప్పుడు ఇంకొక ఆడ జింక అటుగా వచ్చింది. దాన్ని సంహరించాలనుకునే లోపల అది కూడా మానవ భాషలో తాను తన భర్తను వెతుకుతూ విరహంతో కృశించి ఉన్నానని.. పైగా బక్కచిక్కిన తన శరీరమాంసంతో అతడి కుటుంబానికి ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని కోరింది. ఒకవేళ మరికాసేపటి దాకా ఏ జంతువూ దొరకకపోతే తానే తిరిగి వస్తానని అప్పుడు సంహరించమని వేడుకొంది. మొదట కనపడిన ఆడజింక కూడా అలాగే పలికిన సంగతిని గుర్తుకు తెచ్చుకుని బోయ ఆశ్చర్యపోయాడు. మూడోజాము గడిచేసరికి ఒక మగ జింక అతడికి కనిపించింది. దాన్ని బాణంతో కొడదామని అనుకునేంతలోనే ఆ మగ జింక కూడా మానవ భాషలో మాట్లాడింది. రెండు ఆడజింకలు ఇటుగా వచ్చాయా అని బోయనడిగింది. బోయవాడు వచ్చాయని, తనకు ఏ జంతువూ దొరకకపోతే ఆహారంగా తామే వస్తామని కూడా తనకు చెప్పినట్లు బోయవాడు మగ జింకకు చెప్పాడు. అప్పుడా మగజింక అయితే ఆ రెండు జింకలను ఒకసారి చూసుకొని వస్తానని అప్పుడు తనను సంహరించమని పలికి వెళ్లింది. ఇంతలో నాలుగోజాము కూడా గడిచి సూర్యోదయ సమయం దగ్గర పడింది..
బోయ తనకు మాటిచ్చి వెళ్లిన మూడు జింకల కోసం ఎదురుచూస్తూ చెట్టుమీదనే కూర్చున్నాడు. అయితే ఇంతలో మరొక జింక.. దాని పిల్ల అటుగా రావటం కనిపించింది. విల్లెక్కుపెట్టిన బోయవాడితో ఆ జింక కూడా తన పిల్లను ఇంటి దగ్గర విడిచి వస్తానని అప్పటిదాకా ఆగమని పలికి వెళ్లింది. మరికొద్దిసేపటికి నాలుగు జింకలూ బోయవాడికిచ్చిన మాటప్రకారం సత్యనిష్ఠతో అతడిముందుకొచ్చి ముందుగా తనను చంపమంటే తనను చంపమని ప్రాధేయపడ్డాయి. ఆ జింకల సత్ప్రవర్తన బోయబాడిలో పరివర్తనను తీసుకొచ్చింది. ఆ రాత్రంతా అతడు కూర్చున్నది మారేడు చెట్టుకావటం, అతడు తెలియకుండానే శివ శివా అనే ఊతపదంతో శివనామస్మరణ చేయడం.. తన చూపునకు అడ్డంవచ్చిన మారేడు దళాలను కోసి కిందపడవేయటం చేశాడు బోయవాడు. ఆ చెట్టుకిందనే ఓ శివలింగం ఏనాటితో ఉంది. ఆ శివలింగం మీద అతడు వేసిన మారేడు దళాలు పడ్డాయి. అది మారేడు దళ పూజాఫలితాన్ని ఇచ్చింది. నాలుగో జాము వరకూ మెలకువతోనే ఉన్నాడు కనుక జాగరణ ఫలితం వచ్చింది.ఆ రకంగా క్రూరాత్ముడైనప్పటికీ ఈ జాగరం వల్ల అతడి మనస్సు నిర్మలమైంది.శివరాత్రి పర్వదినం అని తెలియకపోయినా అనుకోకుండా ఆ పర్వదినాన చేసిన పుణ్యకార్య ప్రభావంతో అతడిలో మంచి పరివర్తన కలిగింది. అహింసా మార్గాన్ని అనుసరించినవారు శివరాత్రి ఇలా జాగరం చేయడం వలన తనలో ఉన్న క్రూరత్వం వీడి మనిషిగా మారాడు. ఇదే ఈ కథ సారాంశం.