రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంపై నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మంగళగిరిలోని హ్యాపీ రిసార్ట్స్లో చంద్రబాబు తమ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. దీనిలో భాగంగా నియోజకవర్గంలో పోలింగ్ సరళిపై చంద్రబాబు సమీక్షించారు. రాజమండ్రి నియోజకవర్గ పరిధి నుంచి టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజమండ్రి లోక్ సభ అభ్యర్థి మాగంటి రూప సహా పలువురు నేతలు హాజరయ్యారు.
నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితి, టీడీపీ అభ్యర్థుల పనితీరుపై నివేదికలు సమర్పించారు. అనంతరం మీడియాతో మాగంటి రూప మాట్లాడుతూ తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో జనసేన ప్రభావం అనుకున్నదాని కంటే గట్టిగానే ఉందని వ్యాఖ్యానించారు. అయితే జనసేన కారణంగా ఎవరికి ఎక్కువ నష్టం జరిగిందన్న విషయం ఇంకా తేలాల్సి ఉందని అన్నారు. ఈసారి రాజమండ్రి లోక్ సభ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలనూ టీడీపీ గెలుచుకుంటుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.