బుల్లితెర అతి పెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 జూలై 21 నుండి ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో నాగార్జున హోస్ట్గా రూపొందనున్న బిగ్ బాస్ కార్యక్రమం 15 మంది సెలబ్రిటీలతో వంద రోజుల పాటు జరగనుంది. అయితే ఈ షో ప్రారంభం కాకముందే వివాదాస్పదమైంది. ఈ కార్యక్రమంపై కొద్ది రోజులుగా అనేక ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. జర్నలిస్ట్ శ్వేతారెడ్డి, నటి గాయత్రి గుప్తా బిగ్ బాస్ నిర్వాహకులు తమతో అసభ్యంగా ప్రవర్తించారని పోలీసులకి ఫిర్యాదు చేశారు. కేతిరెడ్డి జగదీశ్వర్రెడ్డి కూడా ఈ కార్యక్రమాన్ని బ్యాన్ చేయాలని కోరారు. ఈరోజు మధ్యాహ్నం ఓయూ జేఏసీ “బిగ్ బాస్”ను నిలిపివేయాలంటూ నాగార్జున ఇంటిని చుట్టుముట్టారు. తాజాగా బిగ్బాస్ షోపై ప్రముఖ నటి, ఏపీ బీజేపీ నేత మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేశారు. షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ ను ఎంపిక చేసే సమయంలో నిర్వాహకులు వేసే ప్రశ్నలు అభ్యంతరకరంగా ఉంటాయని మాధవీలత సంచలన ఆరోపణలు చేశారు. అంతే కాదు తాను షో కంటెస్టెంట్గా ఇంటర్వ్యూకు వెళ్లినప్పుడు, అక్కడి నిర్వాహకులు వేసిన ప్రశ్నలకు షాక్ తిన్నానని తెలిపారు. బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ తో ఒకరితో లవ్ లో పడితే ఏం చేస్తావని అడిగినట్లు మాధవీలత తెలిపారు. అయితే ప్రస్తుతం హౌస్లోకి వెళ్లక ముందే ఎలా ఊహిస్తామని తాను చెప్పినట్లు మాధవీలత అన్నారు. బిగ్బాస్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న నాగార్జున ఇలాంటి షోలో పాల్గొనేముందు ఒక సారి పునరాలోచించుకోవాలని మాధవీలత అన్నారు. అలాగే కంటెస్టెంట్స్ కలిసి పడుకోవడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిణామం అని, స్త్రీపురుషులిద్దరికీ వేర్వేరు బెడ్రూంలు పెట్టినప్పటికీ, కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యే కొద్దీ, వారి ఒకే రూంలో పడుకునే పరిస్ధితి వస్తోందని మాధవీలత వాపోయారు. బాత్రూంలో కమోడ్ కనిపించే వరకూ కెమెరా ఏర్పాటు చేస్తారని, డోర్ వేసుకునే వరకూ అంతా చూసేలాగా చేయడం అభ్యంతరకరమని నటి మాధవీలత అన్నారు. బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ మధ్య నిర్వహించే గేమ్స్ సైతం చాలా ఎబ్బెట్టుగా ఉంటాయని, ముఖ్యంగా మహిళా కంటెస్టెంట్స్ను తాకేలా నిర్వహించే గేమ్స్ వల్ల ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారని తెలిపారు.
previous post