“ప్రేమమ్”తో మలయాళంలోనూ, “ఫిదా”తో తెలుగులోనూ ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి తొలి సినిమాతోనే ఘనవిజయం అందుకుంది. ఈ రెండు భాషల్లోనూ నాయికగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడికి తమిళనాట మాత్రం నిరాశే ఎదురయింది. తొలి చిత్రం “దియా”, మలి చిత్రం “మారి-2”, మూడో చిత్రం “ఎన్జీకే” డిజాస్టర్లుగా నిలిచాయి. అయితే `రౌడీబేబి` పాట రికార్డుల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. తమిళ హీరో ధనుష్, సాయిపల్లవి కలిసి నటించిన `మారి-2`లోని ఈ పాట అందర్నీ అలరించింది. ధనుష్, సాయిపల్లవి డ్యాన్స్లకు అందరూ ఫిదా అయిపోయారు. దేశవ్యాప్తంగా ట్రెండింగ్లో కొనసాగింది. భారత్లోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఈ సాంగ్ దూసుకుపోతోందని బిల్బోర్డ్ సర్వే సంస్థ తాజాగా ప్రకటించింది. తాజాగా.. ఈ పాట బిలియన్ల వ్యూస్ను దక్కించుకుంది. సౌత్ ఇండియా ఫిలిం సాంగ్స్లో ఈ పాట ఎప్పుడో చేరిపోయింది. అయితే… ఈ పాట బిలియన్ ప్లస్ సాధించిన సందర్భంగా ఈ చిత్ర నిర్మాణ సంస్థ ఓ సీడీపీ షేర్ చేసింది. ఈ పోస్టర్లో ధనుష్ ఒక్కడే ఉండటపై సాయి పల్లవి అభిమానులు భగ్గుమంటున్నారు. “రౌడీ బేబీ” సాంగ్లో సాయి పల్లవి లేకుంటే అన్ని వ్యూస్ వచ్చేవి కాదని విమర్శిస్తున్నారు. దీనిపై వండర్ బార్ ఫిల్మ్ స్పందించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
previous post