గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. వాణిజ్యపరంగా వినియోగించే కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ పై రూ.266 పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. పెరిగిన ధరలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి. వాణిజ్య సిలిండర్లను ఎక్కువగా హోటల్స్, రెస్టారెంట్లు వినియోగిస్తుంటాయి. దీంతో వినియోగదారులకు దీపావళి ముందు షాక్ తగిలింది.
తాజాగా పెంచిన ధరలతో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర దేశ రాజధాని ఢిల్లీలో రూ.2000 మార్క్ను దాటింది. ఇదివరకు ఈ ధర రూ.1734గా ఉండేది. ముంబైల్లో 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.1950, కోల్కతాలో రూ.2073.50, చెన్నైలో ధర రూ.2133కు చేరింది. అయితే..గృహ వినియోగ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు.
అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు, డాలరుతో రూపాయి మారకం విలువ ఆధారంగా సిలిండర్ ధరల్లో మార్పులు ఉంటాయి.అలాగే స్థానికంగా ప్రభుత్వాలు విధించే పన్నులు ప్రభావం చూపుతాయి. ఎల్పీజీ ధరలను క్రమంగా పెంచుతూ వాటిపై సబ్సిడీని గత ఏడాది తొలగించింది ప్రభుత్వం.
ప్రతి నెల ఒకటో తేదీన ఆయిల్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరల్ని సవరిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మరోసారి ఎల్పీజీ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.
సబ్సిడీ లేకుండా 14.2 కిలోల సిలిండర్ కొత్త ధర
ఢిల్లీలో ఇప్పుడు సబ్సిడీ లేని 14.2 కిలోల సిలిండర్ ధర రూ.899.50. కోల్కతాలో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.926, ముంబైలో రూ.899.50. చెన్నైలో సబ్సిడీయేతర సిలిండర్ ధర ఇప్పుడు రూ.915.50గా ఉంది.