గ్యాస్ వినియోగదారులకు శుభవార్త. ఎల్పీజీ వంట గ్యాస్ సిలిండర్ ధర కొద్దిగా దిగొచ్చింది. అయితే ప్రస్తుతానికి ఇది వాణిజ్య (కమర్షియల్) సిలిండర్లకు మాత్రమే వర్తిస్తుంది. డొమెస్టిక్ సిలిండర్ ధరలు నిలకడగా ఉన్నాయి.
ఆగస్టు 1నుంచి కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 36 మేర తగ్గిస్తున్నట్లు ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. దీంతో ధర తగ్గింపుతో టీ స్టాళ్లు, చిన్న పాటి టిఫిన్ సెంటర్లు నడుపుకునే వారికి కాస్త ఊరట లభించనుంది.నెల వ్యవధిలో రేట్లు తగ్గించడం ఇది రెండోసారి. జూలై 6న 19 కేజీల సిలిండర్పై రూ.8.50 తగ్గించారు.
రాజధాని ఢిల్లీలో ఇప్పటివరకు రూ.2,012.50గా ఉన్న గ్యాస్ బండ ధర రూ.1,976కు చేరింది. ధర తగ్గించకముందు, 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.2012గా ఉండేది.. కోల్కతాలో ఈ ధర రూ.2,095.50, ముంబైలో రూ.1,936.50, చెన్నైలో రూ.2,141 ఉంది.
కాగా స్థానిక టాక్స్ల ఆధారంగా ఒక్కొ రాష్ట్రానికి ఈ సిలిండర్ ధరలు మారుతూ ఉంటాయి. అయితే డొమెస్టిక్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు.