ప్రేమకు పెద్దలు అడ్డు చెప్పడంతో మంస్తాపానికి గురై ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. కొండపాక మండలం లకుడారం గ్రామానికి చెందిన మండే కనకయ్య (21), రాచకొండ తారా (19) గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం వీరి తల్లిదండ్రులకు తెలియడంతో మందలించారు. కులాలు వేరు కావడంతో ఇరువురు కుటుంబాల్లో వీరి పెళ్లికి ఒప్పుకోరని భావించి బుధవారం పాఠశాల భవనంలో ఓకే తాడుతో ఇద్దరు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. నిన్నటి నుంచి వీరిద్దరు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. స్థానికులు స్కూల్ లోపలికి వెళ్లి చూడగా ప్రేమికులు ఇద్దరు ఆత్మహత్య చేసుకుని కనిపించారు. మృతుల కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.