telugu navyamedia
రాజకీయ వార్తలు

లాక్‌డౌన్‌ పై రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ!

Red zone corona

మే 3 వరకు లాక్‌డౌన్‌ ను పొడగించినట్టు ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. దేశంలోని ఆసుపత్రులతో పాటు వెటర్నరీ ఆసుపత్రులు, ఔషధ దుకాణాలు, లేబొరేటరీలు, క్లినిక్‌లతో పాటు అత్యవసర విభాగాలన్నీ ఎప్పటిలాగే పనిచేస్తాయని పేర్కొంది.

నిత్యావసరాలు మినహా దేశంలోని అన్ని వాణిజ్య, ప్రైవేటు సంస్థలు మూసి వేసే ఉంచాలి. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు టెలీ కమ్యునికేషన్లు, ఇంటర్నెట్ సేవలు, ప్రసార, కేబుల్ సర్వీసులు వంటి వాటికి లాక్‌డౌన్ నుంచి యథాతథంగా మినహాయింపు ఇచ్చారు.

పారిశ్రామిక సంస్థలతో పాటు ప్రజా రవాణా సర్వీసులు, హోటళ్లు విద్యాసంస్థలు, ప్రార్థనా మందిరాలు, ఫంక్షన్లపై నిషేధం ఉంటుంది. అన్ని ప్రాంతాల్లో సామాజిక దూరం పాటించడం వంటి ప్రత్యేక నిబంధనలు అమలు చేయాలి. అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల మూసివేత కొనసాగుతుందని కేంద్ర హోం శాఖ ప్రకటించింది.

ప్రజా వినియోగాలు, విద్యుదుత్పత్తి, జాతీయ సమాచార కేంద్రాలు వంటి సంస్థలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఉంటుంది. రాష్ట్రాల్లో పోలీసులు, అత్యవసర సేవలు, జిల్లా యంత్రాంగం, ట్రెజరీ, విద్యుత్, నీరు, పారిశుద్ధ్యం వంటి వాటికి లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఉంటుంది. అలాగే, సాంఘిక సంక్షేమ శాఖ, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ విభాగాలు వంటి సేవలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు కొనసాగుతుందని కేంద్ర హోం శాఖ వెల్లడించింది.

Related posts