ఎండ కాలం అనగానే ఐసులు అంటూ అమ్ముకునే వాళ్లు కనిపిస్తూనే ఉంటారు. అవి చాలా మంది వేసవి తాపానికి కొనుక్కోవడం చప్పరించడం చేస్తుంటారు. అయితే అవి ఎంతవరకు నాణ్యమైనవో తెలుసుకోకపోవటం విశేషం. తాజాగా అలాంటి వారికి షాక్కు గురి చేసే ఘటన ఒకటి కరీంనగర్ జిల్లాలో వెలుగు చూసింది.
ఓ యువకుడికి, జిల్లాలోని హుజూరాబాద్ మండలంలో ఐస్ కొన్నందుకు ఊహించని అనుభవం ఎదురైంది. రాంపూర్ గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే యువకుడు రంగాపూర్ శివారులో తోపుడు బండి వద్ద ఐస్ కొన్నాడు. అతడు దాన్ని తింటుండగా, నోటికి ఏదో తగిలినట్లు అనిపించింది. ఏంటా అని చూసే సరికి.. అందులో చనిపోయిన బల్లి కనిపించింది. దీంతో అతడు వాంతులు చేసుకున్నాడు. ఈ విషయం ఆ నోటా ఈ నోట తెలియండంతో ఆ ఊరి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, బాధిత యువకుడు ఐస్ తయారు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించాడు.