బంధుమిత్రుల మధ్య ఎంతో ఆనందంతో పెళ్లి వేడుకకు హాజరైన మహిళ లిఫ్ట్ ఎక్కగా ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయింది. హైదరాబాద్ లో బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నగరంలోని రాజేంద్రనగర్ బండ్లగూడ కేకే కన్వెన్షన్ హాల్లో ఓ వివాహం జరుగుతోంది. దీనికి ఇరు కుటుంబాల బంధువులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ మహిళ మరో అంతస్తులోకి వెళ్లేందుకు లిఫ్ట్ లోకి వెళుతుండగా ఆమె కాలు లిఫ్ట్ తలుపునకు, భవనానికి మధ్య ఇరుక్కుపోయింది.
అంతలోనే లిఫ్ట్ ఒక్కసారిగా పైకి కిందకు వెళ్లడంతో బాధితురాలికి తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో ఆమె బాధ తట్టుకోక ఒక్కసారిగా కేకేలు పెట్టింది. ఆమె కేకలు విన్న బంధువులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన అనంతరం కన్వెన్షన్ యజమాని పరారయ్యారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.