తన పై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారని వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి తెలంగాణ డీజీపీ మహేందర్రెడ్డికి ఫిర్యాదు చేశారు. కోటి అనే యువకుడితో పాటు కొందరు వ్యక్తులు తనను టార్గెట్ చేసి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై ఆరోపణలు చేసిన కోటి అనే వ్యక్తిని బిడ్డగా భావించానన్నారు. దీని వెనుక ఉన్న కుట్రలను ఛేదించాలని కోరారు. తన పరువు, మర్యాదలు కాపాడాలని విజ్ఞప్తి చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుని.. తనకు న్యాయం చేయాలని ఆమె డీజీపీకి విన్నవించారు.
తెలుగు రాష్ట్రాల్లో రసవత్తరంగా ఎన్నికల ప్రచారం జరుగుతుండగా లక్ష్మీపార్వతిపై కోటి అనే యువకుడు బాంబు పేల్చాడు. తనను లక్ష్మీపార్వతి లైంగికంగా వేధిస్తోందంటూ గుంటూరు జిల్లా వినుకొండ మండలం ఉప్పరపాలెం గ్రామానికి చెందిన కోటి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ‘మిస్ యూ, లవ్ యూ’ అని సందేశాలతో పాటు మానసికంగా.. లైంగికంగా వేధింపులకు గురి చేస్తోందని ఫిర్యాదు పేర్కొన్న సంగతి తెలిసిందే.