తమిళనాట జల్లికట్టుకు ఉన్న ప్రాధాన్యతనుఁ ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. తాజాగా అక్కడ మరోసారి ఈ సాంప్రదాయ క్రీడ మొదలైంది. అయితే ప్రభుత్వం నిషేదించిన ఈ ఆటను కొనసాగించడంపై పోలీసులు అడ్డుకోవటంతో విధ్వంసం చోటుచేసుకుంది. పలుచోట్ల పోలీసు ఆంక్షలను పట్టించుకోకుండా ఈ క్రీడలో పెద్దఎత్తున యువత పాల్గొంటన్నారు. తాజాగా ఆంధ్రా-తమిళనాడు సరిహద్దులోని ఓ పల్లెలో నిర్వహించిన జల్లికట్టు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఖాకీలు ఆట ఆపడానికి రావడంతో వాళ్లపైనేగ్రామస్తులు తిరగబడ్డారు, పోలీస్ జీప్ కూడా ధ్వంసం చేశారు.
హోసూర్ సమీపంలోని మనగుండపల్లిలో నిన్న జల్లికట్టుకు భారీ ఏర్పాట్లు చేశారు. సరిహద్దు కావడంతో.. ఆంధ్రాతోపాటు, కర్నాటక నుంచి కూడా పెద్ద సంఖ్యలో జనం పోటీలు చూసేందుకు తరలివచ్చారు. పోలీసులు జల్లికట్టుకు అనుమతి లేదని చెప్పి.. అందరూ అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పడంతో అక్కడి వారికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వాగ్వాదం కాస్తా కొట్లాట వరకూ వెళ్లింది. పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో.. స్థానికులంతా రాళ్లవర్షం కురిపించారు. కాసేపు ఆ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. పోలీస్ జీప్లతో పాటు ఫైరింజన్ అద్దాలను సైతం పగలగొట్టారు.