ప్రముఖ గాయని లతా మంగేష్కర్ శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది తలెత్తడంతో ఆమెని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. సుమారు నెల రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం ఇంటికి తిరిగి చేరుకున్నారు. ఈ నేపధ్యంలో తన ఆరోగ్యం గురించి ప్రార్థనలు చేసిన అభిమానులకు లత ధన్యవాదాలు తెలిపారు. తాజాగా లతకు సంబంధించిన ఒక ఫొటో వైరల్గా మారింది. ఈ ఫొటోలో లత ఆసుపత్రిలో నర్సుల మధ్య కనిపిస్తున్నారు. ఆమె నాలుగు వారాల పాటు ఆసుపత్రిలో నిమోనియాకు చికిత్స తీసుకున్న తరువాత ఇంటికి వెళ్లారు. 1929 సెప్టెంబరు 28న జన్మించిన లత ఇటీవలే తన 90వ పుట్టినరోజును చేసుకున్నారు. లత తన కెరీర్లో దాదాపు 26వేలకు పైగా పాటలు పాడారు. అందులో ఎక్కువగా హిందీ పాటలే ఉన్నాయి. తెలుగులో ఆమె కేవలం మూడు పాటలే పాడారు. 1955లో వచ్చిన ‘సంతానం’ సినిమాలోని ‘నిదురపోరా తమ్ముడా’, ‘దొరికితే దొంగలు’ సినిమాలోని ‘శ్రీ వేంకటేశా..’, 1988లో వచ్చిన ‘ఆఖరి పోరాటం’ సినిమాలోని ‘తెల్లచీరకు’ పాటలు ఆలపించారు. చివరిగా సౌగంధ్ ముజే ఇస్ మిట్టీకీ సినిమాలో పాట పాడారు. అనేక భారతీయ భాషలలో పాటలు పాడిన లతా మంగేష్కర్ని కేంద్ర ప్రభుత్వం 2001లో భారతరత్న పురస్కారంతో సత్కరించింది.
next post