telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చివరి కోరిక ఇదే

SPB

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. నాలుగు దశాబ్దాల కెరీర్లో 16 భాషల్లో సుమారు 40 వేలకు పైగా పాటలు పాడిన ఆయన గొంతు మూగబోయిందన్న వార్త విని సంగీత అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఏకంగా 16 భాషల్లో పాటలు పాడిన అరుదైన ఘనత ఆయన సొంతం. అయితే ఉన్నత దశకు చేరిన తర్వాత కొత్తవారిని తొక్కేశారన్న ఆరోపణ ఆయనపై ఉంది. కానీ కెరీర్లో తాను ఎవరికీ హాని తలపెట్టలేదని, కొత్త టాలెంట్‌ ఎక్కడున్నా ప్రోత్సహించేవాడినని గతంలో ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో బాలు చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తన చివరి కోరికను వెల్లడించారు. “నా జీవితం వింతైనది. మొదట్లో నాకు సంగీతంపై ఆసక్త లేదు. ఇంజనీరు కావాలని కలలు కని చివరికి గాయకుడిని అయ్యాను. సింగర్‌గా ఎలాంటి నిబంధనలు పెట్టుకోలేదు. సుమారు 20 ఏళ్ల పాటు సిగరెట్లు తాగాను. 40 ఏళ్ల కెరీర్లో రోజుకు 10 గంటలు పాటలు పాడాను. నేను అందరికీ గాత్రం మార్చి పాడలేదు. అల్లురామలింగయ్యకు, రాజబాబుకు వారివారి గాత్రాలకు దగ్గరగా పాడాను. ఎన్టీయార్‌, ఏఎన్నార్‌లకు మాత్రమే గాత్రం మార్చి పాడేవాడిని. నాకున్న పేరు ప్రతిష్ఠల వల్ల నా కొడుకు కెరీర్ సక్రమంగా కొనసాగలేదు. చరణ్‌ను అందరూ నాతో పోల్చి చూడటం వల్ల వాడికి చాలా నష్టం జరిగింది. సంగీతం అని, నటన అని, సినిమా నిర్మాణం అని తడబడ్డాడు. ఐదు సినిమాలు నిర్మించి రూ.11కోట్లు నష్టపోయాడు. కెరీర్లో ఎన్నో ప్రశంసలు, అవార్డులు, రివార్డులు పొందాను. మరణించే వరకు పాడుతూనే ఉండాలి. చావు నా దగ్గరికి వచ్చినట్లు తెలియకుండానే నేను కన్నుమూయాలి. అదే నా చివరి కోరిక” అంటూ బాలు ఓ ఇంటర్వ్యూ లో తన మనసులో మాట వెల్లడించారు.

Related posts