మోటారు వాహనాలు, ట్రెయిలర్ల తయారీ, మోటారు సైకిళ్ల తయారీలో దాదాపు పన్నెండు లక్షల మంది ఆటోమొబైల్ తయారీ రంగంలో పనిచేస్తున్నారు. వార్షిక పరిశ్రమల సర్వే నివేదిక ప్రకారం మోటారు వాహనాలు, ట్రెయిలర్ల తయారీలో 9,87, 191 మంది, మోటారు సైకిళ్ల తయారీలో 2,09, 219 మంది అంటే ఇది 2016-17 వార్షిక నివేదిక. 2018-19 నాటికి ఇది 14 లక్షల దాకా పెరిగి ఉండొచ్చు. అయితే ప్రస్తుతం ఈ రంగంలో అభివృద్ధి లేదు కదా. అమ్మకాలు పడిపోతున్నాయి. 14 లక్షల మందికి తోడు ఆటోమొబైల్ డీలర్ల వద్ద, పంపిణీ దారులవద్ద గణనీయమైన సంఖ్యలో కార్మికులు పనిచేస్తుంటారు.
ఇది గాక ఆటో విడి భాగాల తయారీ యూనిట్లు ఉన్నాయి. వీటిలో 50 లక్షల మంది పనిచేస్తున్నారని ఆటోమోటివ్ కాంపొనెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ తెలియజేసింది. ఈ 50 లక్షల మందిలో 35 లక్షల మంది కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్నవారే. ఆటోమొబైల్ రంగంలో ఏర్పడిన తగ్గుదల వల్ల గత ఏడాది కాలంలోనే 200 కార్ల షో రూమ్లు మూతపడ్డాయి. దాదాపు 2,500 మంది ఉద్యోగాలు పోయాయి. వీరిలో 70 శాతం కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నవారే. ఈ రంగంలో ప్రస్తుత సంక్షోభం కొనసాగితే లక్షలాది కుటుంబాలు రానున్న కాలంలో రోడ్డున పడతాయని సెంటర్ ఫర్ మోనిటరింగ్ ఇండియన్ ఎకానమీ ప్రతినిధులు తెలియజేస్తున్నారు.